Saturday, 8 August 2026

అసలేం జరిగింది ? పతంజలిని ఎందుకు అరెస్టు చేశారు? ‘ఉదయం’ స్టోరీ ….పార్ట్‌ – 2

సారధి : దాసరి నారాయణ రావు
సంపాదకుడు : ఏబీకే ప్రసాద్‌
‘యా దట్స్‌ ఫైన్‌..’ అనుకున్నాక , ఏబీకే
ఉదయంలో చేరారు 1983 మధ్యలో.!

అంతకు ముందు ఆంధ్రప్రభ ఎడిటర్‌గా ఏబీకే ఉన్నపుడు కవి దేవిప్రియా, కార్టూనిస్ట్‌ మోహన్‌ ఆయనతో కలిసి పని చేశారు. వీళ్లిద్దరు మహా ఘటికులని ఏబీకే నమ్మకం. వాళ్లని ఉదయంలోకి లాక్కొచ్చారు. ఏబీకే కుడి భుజం కొమ్మినేని వాసుదేవరావు రానే వచ్చారు. కొండపల్లి రామకృష్ణ ప్రసాద్‌ అనే ఎండీ గాిరు వీళ్ళతో రెగ్యులర్‌గా మాట్లాడేవారు. ఎడిటోరియల్‌ సిబ్బందితో బాటు ఢిల్లీ , హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలలో కీలకమైన రిపోర్టర్ల బ్యూరోలనీ, విలేకరులనీ ఎంపిక చేసే పని ఏబీకే, వాసుదేవరావు గార్లది.!

సర్కులేషన్‌ , మార్కెటింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వాళ్లు.. క్లర్కులు, మేనేజర్లని నియమించే పని రామకృష్ణ ప్రసాద్‌ గారిది.! ఏబీకే, వాసుగారు, రామకృష్ణ ప్రసాద్‌ ముగ్గురూ కృష్ణాజిల్లా కమ్మవాళ్లే అయినందువల్ల వాళ్ళ మధ్య సహజంగా ఉండే ఐక్యత, సఖ్యతతో రిక్రూట్మెంట్‌ యవ్వారం సజావుగా సాగిపోయింది.
ఈ విషయంలో పాపం దాసరి నారాయణ రావుకి
ఏ పాపమూ తెలియదు.! ‘ఉదయం’లో ఒక
ముఖ్య పాత్ర పోషించిన దాసరి పద్మ కూడా
కమ్మ కులస్తురాలే అని గమనించ ప్రార్థన.!
ఈనాడు కమ్మ పేపర్ అని , ఉదయం కాపు
పత్రిక అని ఒక అపోహ వుండేది . ఉదయం లో నిర్ణయాలు తీసుకునే నలుగురూ కమ్మ వారే .
దాసరి కలకత్తా లోనో , కాశ్మీర్ లో నో సినిమా
షూటింగ్ లతో హడావిడిగా వుండే వాడు .

ఒక్క ఏబీకే తప్పితే వాసుదేవరావు, పతంజలి, దేవి ప్రియ, మోహన్‌, ప్రకాష్ మరికొందరి పేర్లు గానీ, ఊర్లు గానీ, వాళ్ళు ఏం చేస్తారో అనేది కానీ దాసరికి అసలు తెలియదు.! అప్పటికే ఎస్టాబ్లిష్‌ అయి పోయిన కమిటెడ్‌ సినిమా మనిషి ఆయన . మోహన్‌ని, దేవి ప్రియని, ఏబీకే గారు తెస్తే.. పతంజలిని, నన్ను కొమ్మినేనిని వాసుగారు రప్పించి ఏబికేకి పరిచయం చేశారు. మోహన్‌ అప్పటికే 13 ఏళ్ల అనుభవం ఉన్న ఆర్టిస్టు, స్టార్‌ కార్టూనిస్టు.
కనుక …వీడు మోహన్‌ తమ్ముడేగా అని నన్ను
ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు.!
అలా కాదు , నేను ఈనాడులో హెడ్డింగులు పెట్టి ఇరగదీశాను.. రామోజీరావు నా భుజం మీద చెయ్యేసి నడిచేవాడు.. ‘నేనేమీ తక్కువ నాకొడుకుని కాను’ అని అందరికీ చెప్పుకోలేను కదా.!
దాంతో మూసుకుని ఒక మూలనపడి ఉండేవాణ్ణి..
పతంజలి లెక్చరర్లు వింటూ …..
మోహన్‌తో టీలు తాగుతూ.!

సరే తర్వాతి ప్రశ్న జీతం ఎంత?
నాకు అప్పటికే ఈనాడులో 1600 రూపాయలు ఇస్తున్నారు. ఉదయానికి వెళ్లకపోతే ఆ రోజే 2600 చేస్తాం అని రామోజీరావు మేనేజర్‌ గోవిందరావు ద్వారా కబురు పెట్టినా వినకుండా రేణిగుంట నుంచి వచ్చేసాను.! నమ్మిన వాసుదేవరావు, ఏబీకే నాకు 1500 రూపాయలు మాత్రమే యిస్తాం అన్నారు,

‘అలాంటిలాంటాడ దాన్ని కాను మేస్తిరి.. నేను
అద్దు రూపాయి డబ్బులకు రాను మేస్తిరి..’
అని మా పశ్చిమగోదావరి పొలాల్లో ఆడకూలీల్లాగా పాటలు పాడి… నేను ఎన్ని డ్యాన్సులు వేసినా
నా జీతం 1500 లే ఫిక్స్‌ చేశారు. నేను తీవ్రంగా గాయపడ్డాను. ‘చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌ అనే డిజిగ్నేషన్‌ ఉన్న ఆరుగురికీి ఒకే స్కేలు ఫిక్స్‌ చేశాం’ అనే సాకు ఒకటి చెప్పారు.. దట్‌ ఈస్‌ జస్ట్‌ రబ్బింగ్‌ సాల్ట్‌
ఇన్‌ ద వూండ్స్‌.! నేను కొంచెం ఎక్కువ కదా
అనే ఫీలింగ్‌ నాకు ఉండేది .

1984 అనే సంవత్సరం ఎంత దారుణమైందో తెలుసు కదా.! భోపాల్‌ గ్యాస్‌ ట్రాజడీ 2500 మంది చనిపోయారు.. స్వర్ణ దేవాలయం మీద భారత సైన్యం దాడి.. భింద్రన్‌వాలేని చంపేశారు.. దీంతో అంగరక్షకులు ఇందిరాగాంధీని చంపేశారు.. 294 మంది ప్రయాణికులు ఉన్న భారత విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్‌ చేశారు.! ‘ఉదయం’ రావడం
లేట్‌ అవుతోంది కదా అని ఖాళీగా ఉండటం
దేనికని నేను పెళ్లి చేసుకుని చచ్చాను.! జీతమేమో 1500.. ఇది కదా డిజాస్టర్‌ అంటే.! 1984 ఏడాది చివర్లో ఉదయం రావడం ఒక్కటే గొప్ప రిలీఫ్‌.!!

ఉదయంలో వ్యక్తులు, సంఘటనలు, చమత్కారాలు అంటూ కనీసం డజను పెద్ద వ్యాసాలైనా రాయగలను. రెసిస్ట్‌ చేసుకొని కొన్ని విశేషాలు మాత్రమే నేను చెబుతాను. హైదరాబాదులో ఉదయం ఎడిటోరియల్‌ పనులు చూడటానికి ఏబీకే వాసుదేవరావు, పతంజలి తదితరులు ఉంటారు కనుక, నన్ను విజయవాడ వెళ్ళమన్నారు. అక్కడ మా బాస్‌ కె రామచంద్రమూర్తి.! అప్పటికి ఆయన ఎవరికి పెద్దగా తెలియదు. తర్వాత మూర్తి అనే
ఏకు మేకైన సంగతి ఎప్పుడైనా మరో సందర్భంలో.

ముషీరాబాద్‌ జైల్లో పతంజలి!

అవి ఉదయం ప్రజాదరణ పొందిన తొలిరోజులు. హైదరాబాద్‌ ఎడిషన్‌లో వచ్చిన మంచివార్తల్నీ, స్టోరీల్నీ విజయవాడ ఎడిషన్‌లో మర్నాడు మేం వేసేవాళ్ళం.! బెంగుళూరులో డెక్కన్‌ హెరాల్డ్‌ అనే పాపులర్‌ ఇంగ్లీషు డైలీ వుండేది.! ఒక కన్నడ రచయిత రాసిన ఒక కథని ఇంగ్లీషులోకి అనువదించి, ఆ పత్రిక ప్రచురించింది. చిన్న హోటల్లో టీలు అందించే ఒక ముస్లిం కుర్రాడికి సంబంధించిన కథ అది. ఆ కథలో ప్రత్యేకత ఏముందో నాకు గుర్తులేదు. కథకి పెట్టిన పేరు మాత్రం ముస్లింల మనోభావాలని గాయపరిచింది.! అప్పుడు బెంగుళూరులో అల్లర్లు జరిగాయి. డెక్కన్‌హెరాల్డ్‌ ఆఫీసుని పెట్రోలు పోసి తగలబెట్టేశారు. నగరంలో రెండు మూడు రోజులు కర్ఫూ పెట్టారు. ఈ అల్లర్ల సంగతి తెలియని న్యూస్‌ఎడిటర్‌ పతంజలి, ఆ కథను తెలుగులోకి అనువదించి, ఉదయం మొదటి పేజీలో ప్రచురించారు. ఆ రోజు ఉదయం ఆఫీసుకి కొన్ని వందల కాల్స్‌ వచ్చాయి. అన్నీ బెదిరింపు ఫోన్‌లే. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది 1985 జనవరి మొదటి వారం కావచ్చు.!

ఈ విషయలేవీ తెలీని నేను మర్నాడు ఆ స్టోరీని విజయవాడ ఎడిషన్‌లో మొదటి పేజీలో పెట్టాను. రాత్రి ఎనిమిదన్నరకి పేపర్‌ ప్రింట్‌ అవుతోంది. సూపర్‌బాస్‌ దాసరినారాయణ రావు, ఎండీ రామకృష్ణ ప్రసాద్‌ ఆ సాయంత్రమే మొదటిసారి విజయవాడ ఆఫీసుకి వచ్చారు. వాళ్ళతో రామచంద్ర మూర్తి, నేను కూర్చుని… పలకరింపులు నడుస్తున్నాయి. పేపరేదీ? అన్నారు దాసరి.
‘నేను తెస్తాను’ అని మిషన్‌ సెక్షన్‌కి వెళ్ళాను. అప్పటికి గొడవల గురించి నాకుతెలిసింది.
నాగుండె గుబగుబలాడుతోంది. దాసరి, పేపరు చూసి, హైదరాబాద్‌లో అంతగొడవ జరిగి, బెదిరింపుఫోన్లు వస్తుంటే, ఆ కథ మొదటి పేజీలో ఏలా పెడతావ్‌? బుద్ధిలేదా? అని అంటే …పైగా
అదే మొదటిసారి, దాసరితో మాట్లాడటం.
అప్పుడే ప్రింటయి వేడివేడిగా వున్న పేపర్లు
నాలుగు తీసుకున్నాను. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో, సన్నగా వొణుకుతున్న చేతులతో వాళ్ళకి పేపర్లు యిచ్చాను. దాసరి, ఫోల్డ్‌ తీసి ఒక్క క్షణం మొదటిపేజీ చూసి వెంటనే తిప్పి వెనక పేజీ చూశారు. దాసరి నటించిన ‘రొటేషన్‌ చక్రవర్తి ’ సినిమా ఫుల్‌ పేజీ ఎడ్వర్‌ట్రైజ్‌మెంట్‌. మా అన్న ఆర్టిస్ట్‌మోహన్‌ దాసరి క్యారికేచర్‌ అదిరిపోయేలా వేశాడు.! దాసరి యిష్టంగా, ముచ్చటగా, ముసిముసి నవ్వుతో ఆ బొమ్మచూసుకుంటూ ‘బావుందికదా, చాలా బావుంది అన్నారు. ఇంతలో ఎండీగారు కాఫీ పట్రమ్మన్నారు.! హమ్మయ్యా! నేను గ్లాసుడు నీళ్ళు తాగాను. వాళ్ళు వేడిగా కాఫీలు తాగారు.!

దాసరి నవ్వుతూ షేక్‌ హ్యాండిచ్చి, ‘బాగా చెయ్యండి’ అని చెప్పి వెళ్ళిపోయారు. వార్తలు పెద్దగా పట్టని సినిమావాళ్ళ వల్ల ఎంతో సుఖమో నాకు అర్థం అయింది.! అయితే, మర్నాడు హైద్రాబాద్‌లో పతంజలిగారిని అరెస్ట్‌ చేసి నాలుగు రోజులు ముషీరాబాద్‌ జైలో పెట్టారు. ‘మీ మంచి కోసమే. ముందు జాగ్రత్తగా అరెస్టు చేశాము.
బెంగుళూరులో ఏం జరిగిందో తెలుసుగా..’
అన్నారు పోలీసు అధికారులు ఏబీకే గారితో.!

సజ్జల ‘రజనీకాంత్‌’ హిలేరియస్‌ స్టోరీ…

సజ్జల రామకృష్ణారెడ్డి ఉదయంలో చేరడం చాలా నాటకీయంగా జరిగింది .1979లో ఈనాడులో
ఒక సాధారణమైన సబ్‌ ఎడిటర్‌ గా 600 జీతానికి చేరిన సజ్జల , రెండేళ్ల తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో జాయిన్‌ అయ్యారు. అప్పుడు భూమికి గజ్జెల మల్లారెడ్డి ఎడిటర్‌ గా ఉన్నారు. ఆయనే సజ్జలకు ఉద్యోగం ఇచ్చారు. ఏబీకే దాసరి కాంబినేషన్లో ఉదయం రాబోతున్న వార్త అందరినీ ఆకట్టుకుంది. యువరక్తం ఉప్పొంగే జర్నలిస్టులు ఉదయంలో చేరడం మొదలయ్యింది ట్రైనీ సబ్‌ ఎడిటర్లుగా. అప్పటికే ఒక 70 మందిని రిక్రూట్‌ చేశారు. ఆర్వి రామారావు, ఆర్టిస్ట్‌ మోహన్‌ తెలిసిన వాళ్ళు గనుక రామకృష్ణారెడ్డి ఉదయంలో చేరాలనుకున్నారు. ఉదయం ఆఫీసుకు వచ్చి మోహన్‌తో మాట్లాడగా, మోహన్‌ ఏబీకే గారికి సజ్జలను పరిచయం చేశాడు. తీసుకునే అవకాశం ఉందని ఏబీకే చెప్పారు.. ఇంకేం హ్యాపీగా ఉదయంలో చేరిపోతున్నాను అని మల్లారెడ్డి గారితో సజ్జల చెప్పాడు. పెద్దాయన హర్ట్‌ అయ్యారు.
మా కడప జిల్లా వాడు, మా సీపీఐ పార్టీ వాడు , మా రెడ్ల కుర్రాడు అని పిలిచి ఉద్యోగం ఇస్తే ఇప్పుడు వెళ్ళిపోయి వేరే చోట జాయిన్‌ అవుతాడా అని మల్లారెడ్డి కోపంతో ఊగిపోయారు. సరే వెళ్ళు అని విసురుగా అన్నారు. భూమిలో రూ.1200 జీతానికి పనిచేస్తున్న సజ్జల ఉదయంలో రూ.1500 ఇస్తారని అనుకున్నాడు. పేపర్‌ మారడానికి అంతా సిద్ధమై సజ్జల ఉత్సాహంగా ఉన్నాడు. అప్పుడు రామకృష్ణారెడ్డి వయసు 24 ఏళ్ళు ఉండవచ్చు .
సజ్జల స్వతహాగా సౌమ్యుడు. మంచి చదువరి. తెలుగు పుస్తకాల కన్నా ఎక్కువగా ఇంగ్లీష్‌ పుస్తకాలు చదివినవాడు. అప్పుడు, కథ ఒక నాటకీయమైన మలుపు తిరిగింది. ఉదయంలో జనాన్ని రిక్రూట్‌ చేసుకోవడం భారీ ఎత్తున జరిగిందనీ, జీతాల బిల్లు విపరీతంగా పెరిగిపోయిందనీ, హైదరాబాదు నుంచి మద్రాసులో ఉన్న దాసరికి సమాచారం కమ్‌ ఫిర్యాదు అందింది. దాంతో ‘స్టాప్‌ రిక్రూట్మెంట్‌’ అన్నారు చైర్మన్‌ దాసరి. సజ్జల జాయిన్‌ కావడం పెండింగ్ లో పడింది . అసలే సజ్జల మొహమాటస్తుడు. మోహన్‌ వీరమొహమాటస్తుడు. అటు ఏబీకే ఏమీ చెప్పలేక ఊరుకున్నారు. సజ్జల రావడం.. మోహన్‌ టేబుల్‌ ముందు కూర్చోవడం.. లాంగ్‌ షాట్‌ లో క్యాబిన్‌లోంచి ఏబీకే చూడటం. రోజులు గడుస్తున్నాయి. చేరే అవకాశం కనబడటం లేదు. తిరిగి భూమిలో జాయిన్‌ అవుదాం అంటే మల్లారెడ్డి క్షమించడు. ఓ రోజు ఏబీకే మోహన్‌ని పిలిచి ‘ఆ కుర్రాన్ని అలా రోజు రావద్దని చెప్పు.. వీలైతే ఎకామిడేట్‌ చేద్దాం’ అని చెప్పారు. సజ్జల సందిగ్ధంలో ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత, (మోహన్‌ని కాదనలేక కూడా ఏమో..) సజ్జలని రమ్మన్నారు. ‘అక్కడ రూ. 1200 వస్తుంది కదా మేమూ 1200 ఇస్తాం’ అని చెప్పారు .
ఈమాత్రం దానికి పేపర్‌ మారడం ఎందుకూ అనుకొని సజ్జల దిగులుపడ్డారు. వెనక్కి వెళ్లే వీలు లేదు కనుక ఆ కొద్దిపాటి జీతానికే ఉదయంలో జాయిన్‌ అయ్యారు సజ్జల.
నవంబర్లో దీపావళి సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిని హైదరాబాదులో కలిసినప్పుడు చాలా పాత కబుర్లు చెప్పిన సజ్జల… ఈ ఉదయం డ్రామా అంతా చాలా హిలేరియస్‌గా నాతో చెప్పారు. సజ్జల కూడా అంతకుముందే పెళ్లి చేసుకోవడం.. చాలీచాలని జీతం.. అని బెంగపడడం జరిగింది. జీతం విషయంలో అచ్చు నాలాగే సజ్జల కూడా గాయపడ్డారు, గత్యంతరం లేకపోయింది.!

చిత్రంగా కాలం తిరగబడింది . ఓ మేజిక్ జరిగింది.
రజనీకాంత్‌ ఫార్ములా సినిమా ‘బాషా’ లాగా, సజ్జల రామకృష్ణారెడ్డి , వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి కలిసి 2007లో సాక్షి పేపర్‌ పెట్టారు. సాక్షి తొలి కార్పొరేట్‌ న్యూస్‌ పేపర్‌గా రికార్డ్‌ సృష్టించింది. పెట్టుబడి దాదాపు రెండువేల కోట్లు. ఒకనాడు ఏబీకే, పతంజలి, రామచంద్ర మూర్తిల దగ్గర ఉద్యోగిగా పనిచేసిన రామకృష్ణారెడ్డి.. ఆ పెద్దలు ముగ్గురికీ సాక్షిలో ఉద్యోగాలు ఇచ్చారు. ఏ బి కే కాలమిస్ట్ గా
సాక్షికి రెగ్యులర్గా రాశారు .

ఛానల్‌ పెట్టిన తర్వాత యానిమేషన్‌ డిపార్ట్మెంట్‌ హెడ్‌గా తాను అభిమానించే ప్రేమించే ఆర్టిస్ట్‌ మోహన్‌ని సజ్జల తీసుకున్నారు. ఉదయంలో 3 వేల రూపాయలకు పని చేసిన మోహన్‌ జీతం సాక్షిలోరెండు లక్షల రూపాయలు… నెలకి ! (సంవత్సరానికి అనుకునేరు.!)
ఆ రకంగా రామకృష్ణారెడ్డి అనే రజనీకాంత్‌ ఆనక రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ముఖ్యమంత్రికి సమానస్థాయి గౌరవాన్ని పొందివు న్నారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక జర్నలిస్టు ఇంత స్థాయికి
రావడం మనసమీప చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.

‘ఉదయం’ దినపత్రిక కారంచేడు హత్యాకాండని ఉద్యమంగా మార్చింది.
నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్‌, యాలకులు.. ఇలా.. అన్ని ప్రసాదాలు, బియ్యం పంచదార, బెల్లం వంటి సకల ఆహార పదార్థాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కుంభకోణాలు సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. దాసరి ఇచ్చిన మహదవకాశాన్నీ, ఏబీకే ఇచ్చిన స్వేచ్ఛనీ.. రాష్ట్రంలోని విలేకరులూ, డెస్క్‌లోని మాలాంటి జర్నలిస్టులు అద్భుతంగా వినియోగించుకుని సమాజానికి ఒకింత మేలు చేయగలిగారు.

నిజంగానే ‘ఉదయం’ అంటే నాకొక గగుర్పాటు…
ఆ జర్నలిజమే ఒక తిరుగుబాటు.!

ఆ మధుర స్వప్నాన్ని అలాగే ఉండనివ్వండి..
ఆ రోజులు మళ్ళీ రావాలని దురాశ పడకండి..!

– తాడి ప్రకాష్‌  

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు