ఇందిరాగాంధీ ప్రమేయంతో 50 ఏళ్ల కిందట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని, రేవంత్రెడ్డి సర్కారు తిరిగి తీసుకుంటామనడం భావ్యంకాదని ప్రముఖ సామాజికవేత్త ఆచార్య హరగోపాల్ అన్నారు. రిజిస్ట్రేషన్ లేనంతమాత్రాన ఆ 400 ఎకరాలు వర్సిటీ భూమికాదని అనడం అన్యాయమని ఆక్షేపించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది కలిసి బుధవారం ‘HCU భూమిని కాపాడుకుందాం’ అనే నినాదంతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా ఆచార్య హరగోపాల్ హాజరై మాట్లాడారు. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, అక్కడి చెరువులు, వాటిమీద ఆధారపడిన జీవరాసులు నశిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీ లిమిటెడ్కు 2003లో ఇదే 400 ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం కేటాయించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేయడంతో సదరు సంస్థ కోర్టుకెళ్లింది. ఆ నేపథ్యంలో అది ముమ్మాటికీ ప్రభుత్వభూమి అని గతేడాది మేలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాంతో తెలంగాణ సర్కారు వేలానికి సిద్ధమైంది’ అని హరగోపాల్ వివరించారు. ఇన్నాళ్లు ఆ భూమిని కాపాడిన వర్సిటీకే 400 ఎకరాలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడే ఊపిరితిత్తులుగా ఆ స్థలాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం పంతానికిపోవడం తగదని హితవుపలికారు. దీన్ని ప్రతిపక్షాలు సైతం రాజకీయం చేయోద్దని ఆయన విన్నవించారు.
బోధనా సిబ్బంది సంఘం అధ్యక్షుడు ఆచార్య భంగ్యా భూక్యా మాట్లాడుతూ… కేవలం 400 ఎకరాలేకాదు వర్సిటీ ఉన్న మిగతా ప్రదేశమంతా ప్రభుత్వానిదే, అలా అని వేలానికి పెడతారా అంటూ నిలదీశారు. HCU భూమిని కాపాడుకునేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఉమేష్ అంబేడ్కర్, ప్రధాన కార్యదర్శి నిహాద్, ఉపాధ్యక్షుడు ఆకాష్, తెలుగుశాఖ విభాగాధిపతి ఆచార్య పిల్లలమర్రి రాములు తదితరులు స్పష్టం చేశారు.


