కొత్త మోటార్ వాహనాల చట్టం అమలు ప్రారంభం
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ద్విచక్ర వాహనదారుల రక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ.. హైకోర్టు ఆదేశాలతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. శనివారం నుంచి విజయవాడ, విశాఖపట్నంలలో అమలు ప్రారంభించారు. విడతలవారీగా జిల్లాలు, గ్రామస్థాయిల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చునే వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి.
విశాఖలో గత సెప్టెంబరు నుంచి, విజయవాడలో డిసెంబరు నుంచి హెల్మెట్ ధారణపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. దీని ద్వారా అవగాహన పెరిగి, ఎక్కువ మంది హెల్మె ట్ ధరిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రా లు, హైవేలపై తనిఖీలు చేపట్టాలని ఎస్పీలకు ఆదేశాలు అందాయి. జరిమానాల సమాచారాన్ని తెలియజేసేలా జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.


