ఈ యాసంగిలో రైతులు పండించిన ధాన్యంలో సగం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. మిగతా సగం ఏం చేస్తారో? ఎవరికి అమ్ముకుంటారో? అది రైతుల ఇష్టం. ఈ మేరకు యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లయ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ సీజన్లో 137.10 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 70.13 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. అంటే రైతులు పండించిన ధాన్యంలో సగం మాత్రమే కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించింది.
వాస్తవానికి వానకాలంతో పోల్చితే యాసంగిలో ధాన్యం దిగుబడి అధికంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఈ యాసంగిలో వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 56.95 లక్షల ఎకరాల్లో వరి పంట సాగింది. ఈ లెక్కన సుమారు 150 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ సివిల్ సప్లయ్ మాత్రం దీన్ని తగ్గించి 137 లక్షల టన్నులకే ఉత్పత్తిని పరిమితం చేసింది. ఇందులోనూ మరింత తగ్గించి కొనుగోలు లక్ష్యాన్ని 70 లక్షలకే పరిమితం చేయడం గమనార్హం. ఈ లెక్కన సర్కారు లెక్కల ప్రకారమే 67 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు ఏ విధంగా, ఎక్కడ అమ్ముకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది.
మార్గదర్శకాల్లో ని కీలకాంశాలు:
ధాన్యంలో తాలు ఎక్కువగా ఉండకుండా వరి కోత సమయంలో హార్వెస్టర్లను కచ్చితంగా 18 RPMకు పైగా నడపాలి.
బ్లోవర్ కచ్చితంగా ఆన్లో ఉండాలి.
సన్న ధాన్యానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మిల్లర్లు 48 గంటల్లో అభ్యంతరాలు తెలపాలి.
కొనుగోలు కేంద్రాల్లో సన్న రకానికి, దొడ్డు రకాలను వేర్వేరుగా కొనుగోలు చేయాలి.
సన్నరకం ధాన్యం బస్తాలపై ‘S’ అక్షరాన్ని రాయించాలి. ఈ ధాన్యాన్ని ప్రత్యేకంగా వేరుగా నిల్వ చేయాలి.
మిల్లుల సామర్థ్యం ఆధారంగా ధాన్యం కేటాయింపు ఉంటుంది. ఒకవేళ నిర్వహణ ఆధారంగా అదనపు ధాన్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.
డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు ఉండదు.
అవసరమైతే మధ్యతరహా గోదాముల్లో (ప్రభుత్వ ఆధ్వర్యంలో) ధాన్యం నిల్వకు చర్యలు తీసుకోవాలి.


